కరీంనగర్ జిల్లాలో మరో పరువు హత్య!

  • శంకరపట్నం మండలం తాడికల్ లో పరువుహత్య
  • కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్న కుమార్ అనే యువకుడు
  • ఇది పరువుహత్యే అంటున్న మృతుడి బంధువులు
పరువు పేరుతో తెలంగాణలో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ లో ఈ పరువుహత్య జరిగింది. గడ్డి కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కుమార్ ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు కుమార్ ను బెదిరించారు. పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ సదరు యువతితో కుమార్ ప్రేమాయణం కొనసాగించాడు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి తాడికల్ శివారులో శవమై కనిపించాడు.

కుమార్ మరణంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. యువతి బంధువులే కుమార్ ను చంపేశారని, ఇది ముమ్మాటికీ పరువుహత్యేనని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. కుమార్ మరణంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విచారణకు వచ్చిన పోలీసు వాహనాన్ని కూడా గ్రామస్తులు ధ్వంసం చేశారు. జీపు అద్దాలను పగలగొట్టారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు పోలీసులు మాట్లాడుతూ, ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని చెప్పారు.
Go Back to Shorts
Karimnagar District
sankarapatnam
honour killing

More Telugu News